Friday, February 15, 2013

నియోజకవర్గమంతా బంధు,మిత్ర,సపరివారం... రాజకీయవేత్తల ఇళ్ళల్లో పెళ్ళి సాంప్రదాయం

ఇద్దరు వ్యక్తుల్ని కలిపి రెండుకుటుంబాలను దగ్గరగా చేర్చే వివాహవేడుక రాజకీయపలుకుపడి ఆర్ధిక స్తోమత వున్న చోట ప్రజల పండుగఅవుతోంది. అలాంటి పెళ్ళిపిలుపు అందుకోవడమే గౌరవం అని జనం అనుకునేలా హంగుఆర్భాటాలతో కొంతకాలం గుర్తుండి పోతున్నాయి

నియోజకవర్గంలో కనీసం ఇంటికొకరైనా వచ్చి అక్షతలువేసి విందుభోంచేసి వెళ్ళకపోతే ఎలా అనే స్ధాయిలో పెళ్ళి ఏర్పాట్లు చేయడం రాజకీయవేత్తల సాంప్రదాయం. ఆడపెళ్ళివారూ మగపెళ్ళివారూ రాజకీయనాయకులే అయినపుడు ఆపెళ్ళి పెద్ద జాతరలాగే వుంటుంది. వేలంటైన్స్ డే రాత్రి రాజమండ్రి దగ్గర సువిశాల మైదానంలో దివంగత జక్కంపూడి రామమోహనరావు కుమార్తెకు , ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు కుమారుడికి పెళ్ళయింది. ఆహ్వానాలు అందుకున్న రెండు ప్రాంతాల ప్రజలూ వేలాదిగా తరలిరావడంతో జాతీయరహదారిమీద టా్రఫిక్ ఆగిపోయింది. గతంలో యనమల రామకృష్ణుడు, కింజరపు ఎర్నాయుడు, తుమ్మల నాగేశ్వరరావు మొదలైన ఎందరో నాయకులు వాళ్ళ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు ఇలాగే చేశారు. డబ్బు మంచినీళ్ళలా ఖర్చవ్వడం ఒక ఎత్తయితే, ప్రతీఒక్కరినీ పలకరించి భోజనశాలకు పంపే కార్యకర్తలు వారి మధ్య సమన్వయం అంతకంటే ప్రయాసనిండిన విశేషం. ఇదంతా బాగున్నప్పుడే 'బాగా పెళ్ళయిందని' ప్రజలు తృప్తి పడతారు. ఆపెళ్ళికి మేమూ వెళ్ళామని గొప్పగా చెప్పుకుంటారు




1 comment:

  1. పెళ్ళంటే నూరేళ్ళ పంట..కొత్త జీవితపు జంట. పానకంలో పుడకలా కరెంటు కోతంట, మధ్యలో రాజకీయాలంట. మీడియా కడుపు మంట తీరుతుందంట..

    ReplyDelete