Saturday, January 26, 2013

రెండో ఎస్సార్సీ కే రాజమండ్రి ఎంపి ఒకే


 తెలంగాణా సమస్య పరిష్కారానికి రెండో (స్టేట్ రీ ఆర్గనైజేషన్ కమీషన్) ఎస్ ఆర్ సి వేయాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానానికే రాజమండ్రి ఎం పి ఉండవల్లి అరుణ్ కుమార్ కట్టుబడి వున్నారు. శుక్రవారం సభ అనంతరం తనపై వచ్చిన విమర్శలను శనివారం మీడియా సమావేశంలో ఆయన ఖండించారు. టి సమస్యపై విధానమేమిటన్న ప్రశ్నకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయానికే కట్టుబడి వున్నానన్నారు. తాను సభలో చెప్పిన ప్రతీమాటకూ డాక్యుమెంట్ల పరంగా ఆధారాలున్నాయని తాను అన్న మాటల్లో ఏది అసత్యమో చెబితే తప్పు దిద్దుకోగలననీ స్పష్టం ఆయన చేశారు.

వెంటనే తెమలని రెండో ఎస్ ఆర్ సి ప్రతిపాదనను అరుణ్ కుమార్ ముందుకి తీసుకు రావడం ద్వారా టి సమస్య ఇప్పట్లో తేలదన్న సూచన ఇచ్చారనుకోవలసి వస్తోంది.



జెండా తిరగబడిన ఆంధ్రజ్యోతి


ఆంధ్రజ్యోతి, ఎబిఎన్ టివి ల అధినేత, పాత్రకేయుడు రాధాకృష్ణ తన కార్యాలయంలో రిపబ్లిక్ డే జాతీయపతాకావిష్కరణలో అసహనాన్ని కోపాన్ని దాచుకోలేకపోయారు. సొంత టివి ప్రత్యక్ష ప్రసారంలోనే ఆయన చికాకును వేలాదిమందిప్రేక్షకులు చూసేశారు. ఉత్సాహంగా జెండా తాడులాగగానే పచ్చరంగు పైన ఎర్రరంగు కింద కనబడి జెండాను తల్లకిందులుగా వేలాడదీసినట్టు బయటపడింది. ఇదే రాధాకృష్ణగారి అసహనానికి మూలం. జెండాను కిందికి దించిన సెక్యూరిటి ఉద్యోగి వెర్రి నవ్వు కూడా ఆయనకు చిర్రెత్తుకు రావడానికి ఒక కారణం కావచ్చు.

ఇలాంటి పొరపాటు ఏ ప్రభుత్వ కార్యాలయంలో జరిగినా మీడియా రోజంతా అదే దృశ్యాలు చూపిస్తూ నిర్వాహకుల్ని అదేపనిగా అవమానిస్తూవుంటుంది. ఇపుడు ఆదేస్ధితి ఓ మీడియా అధినేతకు ఎదురైంది.
ప్రత్యక్ష ప్రసారం (ఒక్కోసారి)ఎంత ఇబ్బందికరమో ఆయనకు అనుభవమై వుంటుంది. పొరపాటు ఎవరికైనా తప్పదు. దానికి ఏవేవో కారణాలు ఆపాదించి వ్యాఖ్యానాలతో హింసించడం ఎంత తొందరపాటో ఎంత బాధ్యతా రాహిత్యమో కూడా ఆయనకి అర్ధమై వుండాలి.
ఎంతో ప్రాముఖ్యమున్న విషయానికే ఉపయోగించవలసిన ప్రత్యక్ష ప్రసారాన్ని పనిలో పనిగా సొంతానికి వాడేసుకోవడం సరి కాదని కూడా ఆయనకు అవగతమై వుండాలి

దేశభక్తి ఒక స్ఫూర్తి అందుకు జెండా పండుగల వంటివి ప్రత్యక్ష రూపాలు. అసలు స్ఫూర్తే లేకుండా పండగలు చేస్తే జెండాలు తల్లకిందులవ్వడంలో ఆశ్చర్యంలేదు. స్ఫూర్తినింపే పని అపారమైన సంఖ్యలో ఉద్యోగులున్న ప్రభుత్వం వల్లకాదు. కొద్ది మందే సిబ్బంది వుండే ప్రతి సంస్ధలోనూ యాజమాన్యాలు పూనుకుంటే సాధ్యమే

రాష్ట్రం ఎందుకు కలసి వుండాలో చెప్పని రాజమండ్రి ఎంపి అరుణ్ సమైక్యవాది కాదా?


"ఆనాడు, ఆంత బలంగా ప్రత్యేక రాష్టా్రన్ని కోరుకున్న ప్రజలు నేడు రాష్ట్ర విభజనను ఎందుకంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు" వివరించడానికి ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ 25 రాత్రి రాజమండ్రిలో ఏర్పాటు చేసిన సభలో అక్కడక్కడా వీడియో క్లిప్పింగులు చూపిస్తూ చరిత్ర ఘట్టాలను ఆసక్తికరంగా చెప్పారు. విడిపోవడానికి జనం ఎందుకు ఒప్పుకోవడం లేదో, ఎందుకు కలిసే వుండాలో ఆయన చెప్పలేదు

తెలంగాణా నాయకులు అబద్దాల విమర్శలు చేస్తూంటే సీమాంధ్రనాయకులు మాట్లాడరేంటని ప్రతీచోటా అడుగుతున్నారని ఆయనే ప్రస్తావిస్తూ " విడాకులు కోరుతున్న భార్య నానా యాగీ చేస్తున్నపుడు భర్త కూడా అలాగే మాట్లాడితే విడాకులు మంజూరైపోతాయి కాబట్టే మన మౌనం" అని బదులిచ్చారు.
రాషా్ట్రన్ని విడగొట్టవద్దని కాంగ్రెస్ హైకమాండ్ వద్ద లాబీయింగ్, వత్తిళ్ళకు పరిమితమైన సీమాంధ్రనాయకులకు గొంతివ్వడానికే అరుణ్ కుమార్ సభ దోహదపడినట్టయింది.
జై ఆంధ్ర ఉద్యమంలో సరిగ్గా 40 ఏళ్ళ క్రితం మీసా కింద అరెస్టయిన జనవరి25 నాడు "అప్పటికి ఇప్పటికి తేడాలను వివరించడానికి" ఈ సభను అరుణ్ కుమార్ ఏర్పాటుచేశారు. రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానంలో ఏడాదికి రెండు మూడుసార్లు నిర్వహించే సింగిల్ స్పీకర్ సభలో్ల అరుణ్ కుమార్ తప్ప వేదిక మీద ఎవరూ వుండరు..ఆయనతప్ప ఇంకెవరూ మాట్లాడరు. ఈ సారి కూడా మొదటి ఏర్పాటు అదే.

ఈలోగా ఢిల్లీలో తెలంగాణ ఇవ్వాలని టి కాంగ్రెస్ నాయకులు, విభజిస్తే రాజీనామా చేస్తామని సీమాంధ్రనాయకులు వత్తిడి పెంచడం
...అసలు మీరేంపోరాటాలు చేశారని సీమాంధ్ర నాయకులను వాయిలార్ రవి ఈసడించడం...వారమంటే వారం కాదు...నెలంటే నెలకాదు అని తెలంగాణా నాయకులమీద గులాంనబి ఆజాద్ విసుక్కోవడం జరిగాయి.

ఈ నేపధ్యంలో అరుణ్ అంతకు ముందుగానే ప్రకటించిన రాజమండ్రి సభ ప్రాముఖ్యత పెరిగింది. విశాఖపట్టణం, విజయవాడ ఏలూరు ప్రాంతాల నుంచి అప్పటి జై ఆంధ్ర ఉద్యమ ప్రముఖులు ఇప్పటికీ ప్రత్యేక రాషా్ట్రన్ని కోరుతున్న కొద్ది మంది పెద్దలు ఇది జై ఆంధ్ర సభేకదా అని ఆరా తీయడం మొదలు పెట్టారు. సమైక్యవాదులైన రాజమండ్రి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ లు విలేకరులను పిలిచి ఇది సమైక్యతా సభేనని 10 మంది సీమాంధ్ర మంత్రులు హాజరౌతున్నారని వివరించారు.
అరుణ్ కుమార్ మాత్రం "మీరుకూడా సభలోనే వినండి" అంటూ ఇది ఏసభో మీడియాకు స్పష్టం చేయలేదు. అరుణ్ కుమార్ కి స్పష్టత లేదనుకోలేము.  ప్రజలు సహేతుకమైన అభిప్రాయానికి రావడానికి వీలుగా వాస్తవాలను ప్రజల ముందుంచడమే ఈ సభ లక్ష్యంగా ఆయన మొదట అనుకున్నారనుకోవలసి వస్తోంది.
అయితే సభ తేదీ ఖరారైపోయాక ఢిల్లీలో జరిగిన పరిణామాలు, స్ధానిక నాయకులు కూడా ఇది సమైక్యతా సభే నని ప్రచారం చేయడం తో ఎదురైన ఇబ్బంది వల్ల అరుణ్ ఉపన్యాసం చరిత్ర వరకే పరిమితమై భవిష్యత్తు దిశా నిర్దేశనానికి దూరమైనట్టు అర్ధం చేసుకోవలసి వస్తోంది.

తెలంగాణా నాయకులు అరుణ్ కుమార్ పై విరుచుకు పడటంలో ఆశ్చర్యమేమీలేదు. ఉద్యమం రాజమండ్రినుంచే ప్రారంభమైందని సమైక్యవాదులు జబ్బలు చరుచుకోవడమూ ఆశ్చర్యం కాదు. అయితే వేర్పాటు వాదానికి అరుణ్ మద్దతు ఎలా వుండదో సమైక్య పోరాటానికి కూడా ఆయన సారధ్యం వుండదు. తగాదాలో ఆలు మగల వాదన ఎలా వున్నా తీర్పు చెప్పేది పెద్దమనుషులే. రాజమండ్రి ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అంతే...రాజమండ్రి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నక్కా నగేష్ అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళంతా హై కమాండ్ నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించేవారే ...అలాంటి వారిలో అరుణ్ కుమార్ ముందే వుంటారు

Thursday, January 24, 2013

రాహులొచ్చె...మొదలాడు!


రాషా్ట్రన్ని విడగొడితే సీమాంధ్రకు, విడగొట్టకపోతే తెలంగాణ కు కోపమొస్తుందని కాంగ్రెస్ పార్టీకి మూడేళ్ళుగా అర్దమౌతూనేవుంది. ఒక డిసెంబరు 9 నాడు తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుని ప్రకటించి తరువాత సీమాంధ్ర లాబీయింగ్, వత్తిళ్ళకు లొంగి విషయాన్ని ఇప్పటివరకూ అపరిష్కృతంగా వుంచేసింది.సమస్యని నానబెట్టి ప్రయోజనంలేదని-కనీసం వారమంటే వారంకాదు...నెలంటే నెల కాదని గులానబీ అజాద్ భాష్యం చెప్పడానికి కారణం సీమాంధ్ర వత్తిడి అనిపించడంలేదు.

సోనియాగాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలైనప్పటినుంచీ ప్రధానంగా కోర్ కమిటీ సలహామేరకే నిర్ణయాలు తీసుకుంటున్నారు. మేడమ్ ఆలోచనలకు అనుగుణమైన అంశాలపై కమిటీ సభ్యుల ఏకాభిప్రాయానికి వస్తారు. లేని అంశాలు పెండింగ్ లో వుండిపోతాయి. ఏ ఒక్కరూ దృఢంగా నిలబడి బాధ్యత తీసుకోని పరిస్ధతే కాంగ్రెస్ లో అగ్రస్ధాయి డొల్లతనం.

రాహుల్ గాంధీ 8 ఏళ్ళుగా క్రియాశీలంగానే వున్నా ఆయన విద్యార్ధి, యువజన వ్యవహారాలకే పరిమితమయ్యారు. తెలంగాణా విషయమై హోంమంత్రి షిండే జనవరి 28 గడువుగా సూచించిన నాటికి కాంగ్రెస్ కు ఆదే పార్టీలో రాహుల్ వ్యవహారాలకు సంబంధం లేదు. ఆతరువాతే రాహుల్ పార్టీ ఉపాధ్యక్షుడయ్యారు. నిన్నే కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపధ్యంలోనే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు రాష్ట్ర విభజన యోచనను వ్యతిరేకిస్తూ వత్తిడి పెంచారు

ఈ సమస్యను రాహుల్ కి విడిచిపెట్టడానికే మరికొంత సమయం అవసరమని అజాద్ సూచించారనుకోవలసివస్తోంది

ఉన్న పరిస్ధితిలో వీలైనన్ని మెరుగులు తీసుకురావడమే సోనియావిధానం. ప్రాంతీయ పార్టీలతో పొత్తులు ఇందులో భాగమే. అయితే రాహుల్ గాంధీ 8 ఏళ్ళ అనుభవం నేర్పిన పాఠాలు మరోవిధంగా వున్నాయి. తమిళనాడు, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ మొదలైన అన్ని రాష్టా్రల్లోనూ కాంగ్రెస్ పొత్తువున్న ప్రాంతీయ పార్టీలు బలపడి కాంగ్రెస్ ఉనికే ప్రశ్నార్ధకమైంది. ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలే కాంగ్రెస్ కు ప్రధాన శత్రువులన్నది రాహుల్ అనుభవం.

మనరాష్ట్రంలో తెలంగాణ ఏర్పడితే టి ఆర్ ఎస్  అవసరం వుండదు. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ కు ఎంతకాలం నిలుస్తుందో తెలియని ఉద్వేగపూరతమైన సానుభూతి తప్ప సిద్ధాంత పునాది,బలాలు ప్రధానంగా లేవు. ఇక గొప్పక్యాడర్ తో సిద్ధాంత పునాదులున్న తెలుగుదేశం పార్టీయే కాంగ్రెస్ కి సమస్యాత్మకం. తెలుగుదేశం బలహీనపడే దిశగా తెలంగాణా సమస్యని పరిష్కరించడం మీద కాంగ్రెస్  ఉపాధ్యక్షుడు దృష్టి పెట్టవచ్చు.

ప్రణబ్ ముఖర్జీ ఆర్ధిక ముంత్రిగా వున్నపుడు ఆయన్న కలుసుకోడానికి రాహుల్ వెళ్ళారు. అక్కడ లిఫ్ట్ పైనుంచి దిగి రావడానికి 3 నిమిషాలు పట్టవచ్చని తెలుసుకున్న రాహుల్ మెట్లెక్కి పైకి వెళ్ళారు. వేచివుండటంలో అసహనం ఏమిటో తెలిసిన రాహుల్ తెలంగాణా సమస్యను వెంటనే బహుశ 28 గడువులోగానే తేల్చేస్తారని ఆశించవచ్చా!

30 ఏళ్ళ రాజకీయ జీవితం కొడుకు "భవిష్యత్తుకై "ఫణం


కొడుకు రాజకీయ భవిష్యత్తుకోసం తూర్పుగోదావరి జిల్లా ప్రముఖుడు బోడ్డు భాస్కరరామారావు 30 ఏళ్ళ రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టేదశలో వున్నారు. తెలుగుదేశం నుంచి పెద్దాపురం ఎమ్మెల్యేగా, తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గా, రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్మన్ గా, అధికార పదవులు అనుభవించి, అదేపార్టీలో ఇపుడు ఎమ్మెల్సీగా వున్న బొడ్డు భాస్కరరామారావు దృష్టి ఇపుడు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వుంది.

60 వపడిలో పడిన బొడ్డు భారతీయ రాజకీయ రంగంమీద  భవిష్యత్తు పాత్రలన్నీ యువతరానివేనని గ్రహించేశారు. తూర్పుగోదావరి జిల్లాలో మైనారిటిలైన తమ చౌదరి సామాజిక వర్గానికి కేటాయిస్తున్న రాజమండ్రి లోక్ సభా స్ధానం నుంచి (హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న)తన కుమారుడికి టికెట్ అడిగి చంద్రబాబుతో లేదనిపించుకున్నారు. "గత ఎన్నికల్లో పోటీ చేసిన నటుడు మురళీమోహన్ కే ఆ సీటు ఇవ్వవలసి వుంటుందని, ఆయువకుడు కొంతకాలం పార్టీలో పనిచేశాక తప్పక ప్రోత్సహిద్దామని" చంద్రబాబు చెప్పనప్పటినుంచీ బొడ్డు ఆలోచనలు మారిపోయాయని ఆయనతో మాట్టాడిన తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు.

రాజమండ్రి లోక్ సభ సీటుపై బొడ్డు కుమారుడికి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి గట్టి హామీ లభించాకే భాస్కరరామారావు స్వరం మారిందన్నది తెలుగుదేశం అంచనా. చంద్రబాబు లేఖవల్లే రాష్ట్రం విడిపోయే పరిస్ధితి వచ్చిదని బొడ్డు ఇప్పటికే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. "ఈ ఆగ్రహమే" ఆయన పార్టీ నుంచి వెళ్ళి పోడానికి దారిచూపిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు

సహజంగానే సంపన్నుడైన బొడ్డు కి రియల్ ఎస్టేట్ బూమ్ మరింత కలసివచ్చింది. అప్పటి అధికార పార్టీలో పాతుకుపోయి వుండటమే బాగా కలసిరావడానికి దోహదపడింది. ఆపేరు ప్రఖ్యాతులు కమ్మ సామాజిక వర్గం లో ఈయన్నిప్రముఖంగా నిలబెట్టాయి.

రెడ్డివర్గం ముద్రవున్న వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ సామాజిక వర్గం మద్దతు బాగా అవసరమైనందువల్లే బొడ్డు భాస్కరరామారావుకి ఆపార్టీ నుంచి ఆకర్షణీయమైన హామీ లభించివుండవచ్చన్నది ఓ విశ్లేషణ. బోడ్డు తన సామాజిక వర్గం తో పార్టీ మార్పిడిపై మంతనాలు జరుపుతున్నారు. వారిలో పెద్దలు నవ్వేసి ఊరుకుంటూండగా యువకులు మాత్రం బొడ్డు ఆలోచనల్ని తీవ్రంగా మొరటైన భాషతో విమర్శిస్తున్నారు

ప్రజల ఆకాంక్షల్ని బట్టి పార్టీలు మారడం వేరు. వ్యక్తిగత, కుటుంబ ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీలు మారడం వేరు. ఈ దిగజారుడుతనం ఆకస్మికంగా సంపదలు వచ్చిపడిన న్యూరిచ్ కుటుంబాల్లో కనబడుతుంది. భూస్వాముల్లో (సాధారణంగా) వుండదు. వారిలో నిబద్ధత ఓ ప్రత్యేకత. అటువంటి కుటుంబీకుడైన బొడ్డు భాస్కరరామారావు లో నిబద్ధత చెదరిపోతూండటం విలువల పతనానికి ఓ తార్కాణమే!

రాజమండ్రి నుంచే "సమైఖ్య" వాదన!


జైఆంధ్ర ఉద్యమం తీర్చిదిద్దిన నాయకుడు, రాజమండ్రి ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ జనవరి 25 న రాజమండ్రిలో సభను ఏర్పాటు చేశారు. జై ఆంధ్ర ఉద్యమకాలంలో 32 రోజులు జైల్లో వున్న ఈయన " ఆనాడు, ఆంత బలంగా ప్రత్యేక రాష్టా్రన్ని కోరుకున్న ప్రజలు నేడు రాష్ట్ర విభజనను ఎందుకంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు" వివరించడానికి, తెరమరుగైన జ్ఞాపకాలను గుర్తుచేయడానికీ 25 నాటి సభకు రావాలని బహిరంగ లేఖలో ప్రజలకు విజ్ఞప్తిచేశారు.సీమాంధ్రలో పలు ప్రాంతాల కాంగ్రెస్ నాయకులు ఈ సభకు హాజరౌతూండటాన్ని బట్టి ఇది సమైఖ్యతా సభగానే అర్ధమైపోతోంది.వాదించి ఒప్పించడంలో సాటిరాగలవారులేరనిపించే అరుణ్ 4 దశాబ్దాల్లో జరిగిన పరిణామాలనుబట్టి కలసి వుంటేనే మంచిదని అనర్గళంగా ఔననిపించేయగలరు. రాజీవ్ గాంధీ ఉపన్యాసాల తెలుగు అనువాదకుడిగా అధినేతలైన సోనియా, రాహుల్ తో పరిచయమున్న అరుణ్ కుమార్ మాటలకు విశేష ఆకర్షణ పరిగణ వుంటాయి.

ఆంధ్రప్రదేశ్ సమైఖ్యత - కాంగ్రెస్ విధనమైనా, కాకపోయినా అరుణ్ కుమార్ సభ మాత్రం సమైఖ్యతా వాదులకు బూస్టే అవుతుంది. ఎందుకంటే ఉద్యమాలూ పోరాటాలూ తెలంగాణా వాదులకు అలంకారాలైతే...పత్రికా గోష్టుల్లో  టివి షోల్లో మాత్రమే సమైఖ్య పోరాటం చేస్తున్నారన్న నిజాన్ని సీమాంధ్ర నేతలు మోస్తున్నారు కాబట్టి!

ముగ్గురూ కాంగ్రెస్ ఎంపిలే వున్న ఈ జిల్లాలో కాకినాడనుంచి కేంద్ర క్యాబినెట్ లోవున్న పల్లం రాజు స్వభావికంగానే సంచలన వ్యాఖ్యానాలకు దూరంగా వుంటారు. రాష్ట్రవిభజన తప్పేలా లేదా అన్న ప్రశ్నకు "అలాంటి సూచనలులేవు" అని బదులిచ్చారు. రాష్ట్రం విడిపోదు అని కూడా చెప్పడం ద్వారా తన సమైఖ్యవాదాన్ని బయటపెట్టుకున్నారు

అధికారపార్టీలో అసమ్మతివాదిగా కనిపించే,పోరాటయోధుడు అనిపించే అమలాపురం ఎంపి హర్షకుమార్ మాత్రం రాష్ట్రం విడిపోతేనే మంచిదన్న తన వేర్పాటు వాదాన్ని ఎప్పుడూ దాచిపెట్టుకోలేదు. మాల మాదిగల వర్గీకరణ వివాదం లేకుండా చేయడానికి కూడా రాష్ట్రవిభజన ఉపయోగపడుతుందని హర్షకుమార్ నమ్ముతున్నరని అర్ధమౌతోంది.హెచ్చుమంది మాదిగలున్న తెలంగాణా, హెచ్చుమంది మాలలున్న ఆంధ్రా - వేర్వేరు రాష్టా్రలైతే వర్గీకరణ సమస్యే మాయమైపోతుందన్నది ఓ లాజిక్. ఇందుకోసం హర్షకుమార్ ఉద్యమించడం లేదు. అయితే, అవసరమైతే "వేర్పాటు" తో సహా ఏ పోరాటానికైనా ఆయన ముందే వుంటారు.అందుకు సిద్ధంగానే వున్నారు

జగన్ వల్లే రాష్ట్ర విభజన ?


రాషా్ట్రన్ని విడగొడితే హెచ్చు లోక్ సభా స్ధానాలు గెలుచుకోగలమని కాంగ్రెస్ హైకమాండ్ కు తెలంగాణా నాయకులుచెబుతున్నంత గట్టిగా, రాషా్ట్రన్ని కలిపివుంచితే  హెచ్చు సీట్లు ఖాయమని సీమాంధ్ర కాంగ్రస్ పెద్దలు నమ్మించలేక పోతున్నారు.

రాయలసీమలో, కోస్తాంధ్రలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ ను వచ్చే ఎన్నికల్లో నిలువరించడం జరిగేపని కాదని అర్ధం చేసుకున్నాక, సాధ్యమైనంత వరకూ రాజకీయ నష్టాన్ని నివారించుకోడానికే ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తున్నట్టుంది.

తెలంగాణాలో తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడున్నవ్యతిరేకత చంద్రబాబు పాదయాత్ర తరువాత తగ్గుముఖం పట్టింది. ఇది కూడా కాంగ్రెస్ కు ఇబ్బందే. కెసిఆర్ నికలుపుకోవడం ద్వారా ఈ నష్టాన్ని నివారించుకోవచ్చన్న ఆలోచనల్ని రెండు ప్రాంతాల నాయకులతో రాష్ట్రవ్యవహారాల ఇన్ చార్జ్ ఆజాద్ సూచనగా లీక్ చేయడమే ఇప్పటి వాతావరణానికి తెరతీసింది.

పార్టీ హైకమాండ్ సంభాషణల వెనుక అప్రకటిత నిర్ణయం ఎంత స్పష్టంగా వుందో - సమైఖ్యవాదులైన మంత్రులు జి కె వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి, కాసు కృష్ణారెడ్డి డిల్లీలో విలేకరులతో మాట్లాడిన నీరసపు వ్యాఖ్యానాల్లోనే బయట పడిపోయింది

మూడేళ్ళ క్రితమే జరిగిపోయిన విభజన నిర్ణయం సీమాంధ్రనాయకుల ఒత్తిళ్ళ, లాబీయింగ్ లవల్ల ఆగిపోయింది. ఇప్పుడు ఆదే నిర్ణయాన్ని అమలు చేయవలసిన వుండటం , కాలయాపనలో పార్టీకి కలిగిన నష్టం కాంగ్రెస్ కు సీమాంధ్ర నాయకులంటే చిర్రెత్తుకొచ్చే స్ధితి ని సృష్టించింది.

ప్రత్యేకాంధ్ర ఉద్యమం పుట్టిన 35 ఏళ్ళ క్రితమే రాష్ట్ర విడిపోయివుంటే ఈపాటికి రెండు అభివృద్ధి చెందిన తెలుగు రాష్టా్రలు వుండేవి. ఆతర్వాత సీమాంధ్ర ప్రజలుకూడా హైదరాబాద్ నే ఆలంబన చేసుకున్నారు. ఆ ప్రాంతంలో చాలా పట్టణాలు మూడున్నర దశాబ్దాలుగా పాడుబడిపోతున్నాయి.

80 లక్షల మంది వున్న హైదరాబాద్ లో 30 లక్షల మంది సీమాంధ్రులు.వారు స్వస్ధలాలతో నిరంతర సంబంధాలున్నవారే. నాయకులకు తప్ప కాస్మోపాలిటన్  కల్చరున్న భాగ్యనగర ప్రజలకు ప్రాంతాల తేడాలుండవు.భౌగోళికంగా తెలంగాణా మధ్య లోవున్న హైదరాబాద్ సీమాంధ్రకు కూడా రాజధాని గా వుండలేదు.
రాష్ట్రం విడిపోత సీమాంధ్ర అభివృద్ధి ఫోకస్డ్ గా జరుగుతుంది. ఈ పా్రంతపు వనరుల వినియోగం మరింత పెరుగుతుంది