Saturday, February 23, 2013

బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ కర్రి రామారెడ్డి గారికి మరో బాధ్యత...



3 రకాల ఫుడ్

అనారోగ్య సమస్యలు రాకుండా వుండాలంటే మనం తినే ఆహారం 3 రకాలుగా వుండాలని ఆయుర్వేదం చెప్పింది
1) హితభుక్త : తేలిగ్గా జీర్ణమయ్యే తిండి తినడం
2) మితభుక్త : అవసరమైనంతే తినడం ఎక్కువసార్లు తినకపోవడం
3) రుతుభుక్త : ఆయా సీజన్లలో మాత్రమే వచ్చే ఆహారవస్తువులను తప్పని సరిగా తినడం (మామిడి పళ్ళు, తాటిముంజులు, తేగలు మొదలైనవి ఎన్నో)

Thursday, February 21, 2013

షాక్ లో వున్నాం - శూన్యంగా వున్నాం - దిగులుగా ఉన్నాం

జీవితంలో కష్టాలు సమస్యలు మోసుకుంటూ రేపటిమీద ఆశలతో ఉన్నంతలో సంతోషంగా బతికేస్తున్న అతి మామూలు మనుషులు బతికుండగానే పేలిపోవడాన్ని,గాయపడినవారు భయంతో బాధపడటాన్ని చూస్తున్నాం.

పాలనలోనే కాదు. హింసలోనూ రాజకీయాలున్నాయి. సిద్ధాంత వైరుధ్యాలు వున్నాయి. అవి హింసను ఆయుధంగా చేసుకుని అదాటుగా విరుచుకు పడుతున్న ప్రతీసారీ ఇలాగే జరగడాన్ని చూస్తున్నాం.

భయపడటం..బాధపడటం..ఆవేశపడటం..నిస్సహాయతతో రగిలిపోవడం...రోజువారీ బతుకులో పడిపోవడం...అలవాటుపడిపోయాం.

దేశద్రోహులైన విధ్వంసక శక్తులు విదేశీ శక్తులతో చేతులు కలిపి ఇటువంటి దాడులు చేస్తున్నారని ప్రతీసారీ తెలుసుకుంటున్నాం.

సంయమనం పాటించండి...నేరగాళ్ళను వొదిలేది లేదు...లాంటి మాటలు చెప్పే నాయకుల మీద చిరాకుపడుతున్నాం.

బావురుమని ఏడవనివ్వని దుఃఖం బాధితులను మరింత బాధితులుగా మారుస్తుంది. బాధలో వున్నవారికి లోకం గొడ్డుపోలేదన్న ధీమా అడుగంటి పోతుంది. ఎప్పటికైనా న్యాయం జరుగుతుందన్న ఆశ చచ్చిపోతుంది.

నెత్తురోడే మాంసపు ముద్దలుగా రోడ్డుమీద విచ్చిన్నమైపోయిన మనుషుల దుర్మరణాలను వీరమరణాలనీ త్యాగమరణాలనీ ప్రస్తుతించుకుంటాం అయినా మనిషితనపు జ్ఞాపకాలను కుక్కచావు దయనీయంగా వెంటాడక మానదని మౌనంగా తలపోసుకుంటాం

ఉరితీతలు ...కాల్చివేతలు...ఉద్వేగాల్ని ఉపశమనపరచవచ్చు...కష్టాలతోనే ఉన్నంతలో సంతోషంగా బతకడానికి ఇలాంటి విస్ఫోటనాలు అడ్డుపడవని భరోసా కావాలి. ఆ నమ్మకం ఇవ్వాల్సిన ఆబాధ్యత పాలకులదే..అందుకు వారేం చెప్పినా చేయడానికి మనం సిద్ధంగా వున్నాం.








కాంగ్రెస్ మండల కమిటీ అధ్యక్ష పదవి ఒక వ్యక్తికి రెండుసర్లే అదీ 45 ఏళ్ళలోపలే! రాజకీయాల్లో రిటైర్ మెంటు-రాహుల్ ప్లాన్?

ముప్పై ఐదేళ్ళ లోపు వయసువారు జనాభాలో 50 శాతానికి చేరుకున్న మనదేశంలో రాజకీయ నాయకులకు రిటైర్ మెంటు అవసరమేనా ? ఈ దిశగా రాహుల్ గాంధీ సంస్కరణలు ప్రారంభించారా ? కాంగ్రెస్ నాయకులు అమలు అవ్వనిస్తారా ?

రాజకీయాల్లో వయోపరిమితి కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రారంభమౌతోంది. 43 ఏళ్ళరాహుల్ గాంధీ ఉపాధ్యక్షుడి హోదాలో పార్టీ సారధ్యం తీసుకున్నాక చేపట్టిన సంస్కరణల్లో ఇది ఒకటిగా కనబడుతోంది.

మండల, బ్లాక్ స్ధాయిలో కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు రెండునెలల్లో పూర్తిచేయాలని జైపూర్ లో జరిగిన సదస్సు నిర్ణయించింది. ఈ కమిటీల్లో ఇప్పటికే రెండు సార్లు అధ్యక్ష పదవులు నిర్వహించిన వారు మరో సారి ఎన్నిక కాకుండా చూడాలని అలాగే 45 ఏళ్ళ వయసు పైబడినవారు పోటీ పడరాదని సదస్సు సూచించినట్టు తెలుస్తోంది. ఇదంతా రాహుల్ గాంధీ'విజన్' లో భాగమేనని అర్ధమౌతోంది.

పొలిటికల్ రిటైర్ మెంటు కోసం చట్టంచేయడం ప్రాధమిక హక్కులకు భంగకరం. ప్రజాస్వామ్య విరుద్దం. నిబద్ధతతో రాజకీయ పార్టీలు 'కట్టడి' ద్వారా మార్పులను తీసుకురావచ్చు.

సాంఘిక, ఆర్ధిక, రాజకీయ చైతన్యాల నుంచి వాటంతట అవే చాలా మార్పులు వస్తాయి. చదువు విస్తరించడం, స్త్రీలు చురుగ్గా రాజకీయాల్లో పాల్గొనడం, విద్యావంతులైన యువతరం, బాగాసంపన్నులు,పారిశ్రామికవేత్తలు నేరుగా చట్టసభలకు ఎన్నిక కావడం మొదలైనవన్నీ ఈ తరహా మార్పులే. రాజకీయంగా ఉన్నత స్ధానాల్లో వున్న వారికి సంకల్పం చిత్తశుద్ది అమలుచేయగల సామర్ధ్యం వుంటే చిన్న మార్పే పెద్దవిప్లవం కావచ్చు.

అధికార పదవులకు, పార్టీలో నిర్వహించిన పదవులే ఒక గీటురాయి అన్న ప్రమాణాలను స్ధూలంగా అన్ని పార్టీలూ పాటిస్తున్న నేపధ్యంలో 45 ఏళ్ళకుమించిన కాంగ్రెస్ అధ్యక్షులు కాకూడదంటే, మూడోసారి పదవి వద్దంటే పెద్దలుపడనిస్తారా అన్నది అనుమానమే!

పెత్తందార్లే గదిలో కూర్చొని సభ్యత్వాలు రాసి డబ్బు కట్టి 'పార్టీ ఎన్నికల తంతు' ముగించే అలవాటు కాంగ్రెస్ వారిది.కొత్త సూచన కూడా వారిపనిని ఇబ్బంది పెట్టకపోవచ్చు. 'పోటీకి మరెవరూ ముందుకి రాకపోవడం వల్ల ఏకగ్రీవ తీర్మానాల' ద్వారా పాత వారే ఎన్నికయ్యే ప్రక్రియ పూర్తికావచ్చు.

అయితే చైతన్యం పెరుగుతున్న కాంగ్రెస్ యువకులు పూనుకుంటే మార్పుతప్పదు. రాహుల్ ఆశ కూడా అదేననిపిస్తోంది

వయోపరిమితి మూడోసారి ఎన్నిక మొదలైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని పిసిసి అధ్యక్షుడు జిల్లాకాంగ్రెస్ అధ్యక్షులకు ఎమ్మెల్యేలకు ఎంపిలకు ఈ మధ్యే లేఖరాశారు. మండల స్ధాయి పార్టీ కమిటీల ఏర్పాట్లపై నెలాఖరుకల్లా పిసిసికి నివేదిక పంపాలని కోరారు.

ప్రాధమిక స్థాయి కాంగ్రస్ కమిటీలంటే సాధారణంగా ఒక 'మాటమీదే' నియామకమౌతూంటాయి. ఈ వయో పరిమితులు పైస్ధాయి కమిటీలకు వెళితే మనం చూస్తున్న నాయకులందరూ రిటైర్ అయిపోతారు. అది సహజంగానే వారికి ఇష్టముండదు. అందువల్లనో ఏమో " ప్రాధమిక స్ధాయి కాంగ్రెస్ కమిటీ నేతల కు 45 ఏళ్ళ వయోపరిమితి-రెండుసార్లకు మించి పదవి చేపట్టరాదు" అనే సూచన కు కాంగ్రెస్ నాయకులు పెద్ద ప్రచారం ఇవ్వటం లేదు. ఏస్ధాయిలో అయినా వయో పరిమితి విషయమే కాదన్నట్టు పెదవి మెదపడం లేదు.










Wednesday, February 20, 2013

నాయకుడికి గౌరవం - యువకుడికి వాత్సల్యం!

తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్ విద్యార్ధులకు యువకులకు బాగా తెలిసిన ఈ యువకుడు రాజమండ్రిలో ముఖ్యమంత్రిని గౌరవపూర్వకంగా కలిశాడు. రాజమండ్రిలో కంప్యూటర్ సైన్స్ ,లండన్ స్కూల్ లో ఎకనామిక్స్ చదివిన ఈ యువజన నాయకుడి పేరు జివి శ్రీరాజ్. రాజమండ్రి మొదటి మేయర్ పదవికి ఎన్నకలప్పటినుంచి రాజకీయాల్లో పనిచేసి గుర్తింపు తెచ్చుకున్న ఇతనికి అమలాపురం ఎంపి హర్షకుమార్ గారి పెద్దబ్బాయి ఆనే ప్రత్యేక పరిచయం అవసరం లేదు

ఇక'స్ధానిక'ఎన్నికలు రాజమండ్రిలో సి ఎం వెల్లడి

రాష్ట్రంలో స్ధానిక సంస్ధలకు త్వరలో ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజమండ్రిలో చెప్పారు.

సహకార ఎన్నికలలో మాదిరిగానే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా కలిసికట్టుగా కృషిచేసి కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించాలని ఆయన ఆపార్టీ నాయకులకు పిలుపు యిచ్చారు.

మంత్రి పినిపే విశ్వరూప్ పెళ్ళి రిసెప్షన్ కోసం గతరాత్రి అమలాపురం వెళ్ళిన ముఖ్యమంత్రి రాజమండ్రి చేరుకుని విశ్రమించారు. ఉదయం మంత్రి తోటనరశింహం, ఎంపిలు ఉండవిల్లి అరుణ్ కుమార్, జివి హర్షకుమార్ రాజమండ్రి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ మొదలైన నాయకులు ముఖ్యమంత్రిని కలిశారు.

సహకార ఎన్నికల్లో విజయానికి వారిని ముఖ్యమంత్రి అభినందించారు. "స్ధానిక సంస్ధల ఎన్నికలకు మన ప్రభుత్వం సిద్ధంగానే వుంది.రిజర్వేషన్ల వివాదం వల్ల ప్రతిష్టంభన లో పడ్డాము. కోర్టుతీర్పు అనుకూలంగావచ్చింది కాబట్టి ఇక సమస్యలేదు. ఎన్నికల ఏర్పాట్లు మొదలుపెడతాము" అని ముఖ్యమంత్రి వారితో అన్నారని తెలిసింది. ఆతరువాత ఆయన విమానంలో హైదరాబాద్ బయలు దేరారు


Monday, February 18, 2013

Educate the child to be Happy



ఎమ్మెల్సీ ఎన్నికల వెబ్ కాస్ట్

ఫిబ్రవరి 21న తూర్పు పశ్చిమగోదావరి జిల్లాల నుంచి శాసన మండలికి గ్రాడ్యుయేట్ల ఎన్నికల ప్రక్రియను ఇంటర్ నెట్ ద్వారా కంప్యూటర్లపై చూడటానికి వెబ్ కాస్ట్ చేస్తున్నారు

కాకినాడలోని జెఎన్ టి యు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని జె ఎన్ టి యు, ప్రగతి, ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్ధులు నిర్వహిస్తారు. వీరంతా 20 వతేదీనే పోలింగ్ బృందాలతో ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి కంప్యూటర్లకు బి ఎస్ ఎన్ ఎల్ కనెక్షన్లు అమర్చి ట్రయిల్ వెబ్ కాస్ట్ చూసుకుంటారు. ఇందుకు ఎన్ ఐ సి సంస్ధ టెక్నాలజిని అందజేస్తోంది.

పోలింగ్ కేంద్రాల్ని పారదర్శకంగా చూపించే ఈ వెబ్ కాస్ట్ (ప్రత్యక్ష) ప్రసారంలో ఓటర్ల ప్రయివెసి కి ఎలాంటి సమస్యా వుండదని జె ఎన్ టి యు ప్రతినిధి వివరించారు

తమిళనాడు యుపి మోడల్స్ - దేశమంతా బిసి రాజ్యం!

సామాజికంగా వెనుకబడిన బిసి కులాల మీదే ఆధారపడే ప్రభుత్వాలు నిలదొక్కుకోగల పరిస్ధితి దేశవ్యాప్తంగా విస్తరిస్తోందని తెలగ బలిజ కాపు రిజర్వేషన్ సాధనా సమితి గుంటూరులో ఆదివారం అభిప్రాయపడింది. తమిళనాడు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మొదలైన రాషా్ట్రలే ఇందుకు ఉదాహరణని రాష్ట్రదేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య వివరించారు. ఈ మూడు కులాలను బిసి జాబితాలో చేర్పించే బిసి డిక్లరేషన్ కోసం కృషిచేద్దామని ఆయన అన్నారు.

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ విలీనం చేయడానికి ముందు సోనియా గాంధీ వద్ద చిరంజీవి తాను ప్రస్తావించిన అంశాల్లో కాపులను బిసిల్లో చేర్చడం, తెలంగాణా, పోలవరం ప్రాజెక్ట్ వున్నాయన్నారు

తాను అవమానాలతో తెలుగుదేశం పార్టీని వదలలేదని రెండుసార్లు తనకు ఆపార్టీ రాజ్యసభసభ్యత్వమిచ్చి గౌరవించిందని కూడా ఆయన గుర్తుచేసుకున్నారు


Sunday, February 17, 2013

బిజెపిలో చిరంజీవి అల్లుడు

ఇంకా విడాకులు మంజూరుకాని కేంద్రమంత్రి చిరంజీవి అల్లుడు శిరీష్ భరద్వాజ బిజెపిలో చేరారు
చిరంజీవి రెండోకూతురు శ్రీజ ను ప్రేమించి పెళ్ళాడిన శిరీష్ నుంచి ఆతరువాత భార్య దూరమై తండ్రి ఇంట్లోనే వుంటోంది. చిరంజీవి కుటుంబానికి ఈ వివాహం నచ్చలేదు. శ్రీజ పుట్టాకే ఆకుటుంబానికి బాగా కలసివచ్చిందంటారు. ఆ అమ్మాయి ఇంటినుంచి దూరమయ్యాక చిరంజీవి ప్రజారాజ్యం విఫలమైంది. పార్టీని నడపలేని స్ధితిలో సతమతమౌతూండగా భర్తతో తగాదాపడిన శ్రీజ పుట్టింటికి వచ్చేసింది. ఆతరువాతే చిరంజీవి కాంగ్రెస్ లో కలిసిపోయారు. కేంద్రంలో మంత్రి అయ్యారు. ఈ'అదృష్టమంతా' శ్రీజ వల్లేనని చిరంజీవి అభిమానులు పిచ్చిగా నమ్ముతారు. శిరీష్ దగ్గరకంటే తమదగ్గరే అమ్మాయి వుండటం మంచిదనుకున్నారో ఏమోగాని...ఆలుమగల తగాదా విడాకుల కోర్టుకెక్కింది. ఇంకా విచారణ జరుగుతూనే వుంది

శిరీష్ ఒక వ్యక్తిగా సాదాసీదా మనిషే అయినా చిరంజీవి అల్లుడిగా సెలబ్రెటీ అయిపోయాడు. రాజకీయపార్టీల కన్ను ఆ యువకుడి మీదుంది. చివరికి బిజెపితో జతకట్టాడు. 200 మంది కుర్రవాళ్ళతో హడావిడిగా శుక్రవారం రాజకీయ ప్రవేశం చేశాడు

యువతలోదేశభక్తిని నింపడం బిజెపి వల్లే అవుతుందని నరేంద్రమోడీ కిషన్ రెడ్డి ఇన్ స్పైరర్లని అంటున్న శిరీష్ సభికులను ఖచ్చితంగా కొంతకాలం ఆకర్షిస్తారు



ఈట్ అవుటవుతున్న మాల్స్! - మారుతున్న రాజమండ్రి లైఫ్ స్టైల్

కొనుగోలు శక్తిలో - (మెటో్రలు, రాష్టా్రల రాజధానులుమినహా) దేశంలోనే 10 వస్ధానంలో వున్న తూర్పుగోదావరి జిల్లాలో వేగంగా మారిపోతున్న జీవనశైలి పెద్ద పట్టణం రాజమండ్రిలో బాగా కనబడుతోంది.
వీకెండొస్తేచాలు రిలయన్స్, స్పెన్సర్స, మోర్ లాంటి షాపింగ్ మాల్స్ కిటకిటలాడిపోతూంటాయి. వర్కింగ్ లంచ్ అన్నట్టు అక్కడికక్కడే నిలబడితినేసే 'క్విక్ ఈట్' వ్యాపారమే అసలు వ్యాపారానికి ధీటుగా రిలయన్స్ షాపింగ్ మాల్ లో పెరిగిపోతోంది.
'ఏంటీ ప్లాన్స్'అని ఓ ఇంజనీరింగ్ సూ్టడెంట్ ని ముగ్గురు ఫ్రెండ్స్ అడుగుతున్నపుడు 'సింపుల్ విండో షాపింగ్...ఇక్కడే ఈటింగ్...మ్యాట్నీ...అంతే' ననిచెప్పింది...చాలామంది చిన్నపిల్లలతో వచ్చి కావలసినవి వస్తువులు కొనుక్కుని ఫాస్ట్ ఫుడ్ తినేసి వెళ్ళిపోతున్నారు. మూడేళ్ళ క్రితం వరకూ లంచ్ డిన్నర్లు ఇంట్లోనే స్నాక్స్ మాత్రమే బయట. ఇపుడు మొత్తం సీను మారిపోయింది
60శాతం వరకూ డిస్కౌంట్ అన్న ప్రకటనలు ఒక ఇంట్లో మూడుతరాలవాళ్ళనీ మాల్స్ లోకి ఆకర్షిస్తున్నాయి. వాళ్ళు ఎంతకొన్నారన్న క్వశ్చన్ ని పక్కన పెడితే కొంతైనా తింటారన్నది ఖాయమైపోయింది. వయసు బాగా పైబడిన వాళ్ళే అంత డిసౌ్కంట్ అన్నారు ఇంతే ఇస్తారా అని నిలదీస్తూంటే 'ఆ ఐటమ్ అయిపోయింది మేడమ్' అని అందమైన స్వరంతో తెచ్చిపెట్టుకున్న వినయంతో సేల్స్ గాల్స్ రెస్పాండవుతూవుంటారు