Saturday, March 16, 2013

ఆ ఎమ్మెల్యేలపై వేటు వేసే ధైర్యం ఉందా!

అవిశ్వాస తీర్మానం సందర్భంగా విఫ్ ఉల్లంఘించిన కాంగ్రెస్ , టిడిపి ఎమ్మెల్యేలపై వేటు పడుతుందా అన్నది చర్చనీయాంశంగా ఉంది.కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టిన అవిశ్వాసానికి అనుకూలంగా తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటు వేశారు.జోగి రమేష్ , పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , గొట్టిపాటి రవి, ఆళ్ల నాని, పేర్ని నాని, సుజయ కృష్ణ రంగారావు, ద్వారంపూడి చం«ద్రశేఖర రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, రాజేష్ కూడా అవిశ్వాసానికి ఓటు వేసిన వారిలో ఉన్నారు.కాగా, ఆరుగురు తెలుగుదేశం తిరుగుబాటు ఎమ్మెల్యేలు కూడా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. వారు బాలనాగిరెడ్డి, సాయిరాజ్, అమర్నాథ్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, కొడాలి నాని, వనిత ఉన్నారు. తటస్థంగా ఉండాలని పార్టీ వీరికి విప్ జారీ చేయగా దానిని వారు ఉల్లంఘించారు.మరో ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి తీర్మానం ప్రతిపాదన సమయంలో మద్దతు ఇచ్చినా, ఆ తర్వాత ఓటింగు సమయంలో పాల్గొనలేదు. విప్ ఉల్లంఘించినవారిపై ఇప్పటికిప్పుడు అనర్హత వేటు వేస్తే ఆరు నెలలలోగా ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉంటుంది.గత ఉప ఎన్నికలలో పద్దెనిమిది ఉప ఎన్నికలు జరిగితే పదిహేను చోట్ల వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గెలవడంతో ఆ పార్టీకి కొత్త ఊపు వచ్చినట్లయింది.ఇప్పుడు కూడా మరో ఏడాదిలోగా సాధారణ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఉప ఎన్నికలు రావాలని కాంగ్రెస్ ,టిడిపిలు కోరుకోవడం లేదు. అయినప్పట్టికీ సవాలుగా తీసుకుని విప్ ఉల్లంఘించినవారిపై వేటు వేసి ఎన్నికలకు సిద్దపడితే చెప్పలేం .కాని ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం వేటు వేయడానికి మరికొంత సమయం తీసుకోవచ్చు.మరో ఆరు నెలల వరకు దీనిని పెండింగులో ఉంచి, ఆ తర్వాత అనర్హత వేటు వేసినా ఉప ఎన్నికలకు అవకాశం ఉండదని భావిస్తున్నారు. అందువల్ల ఉప ఎన్నికలు వద్దని భావించే పక్షంలో కాంగ్రెస్,టిడిపిలు ఇప్పటికిప్పుడు అనర్హత వేటు వేసే దిశగా వెళ్లకపోవచ్చని భావిస్తున్నారు.

*గెలిచినా మైనారిటీలో పడ్డ రాష్ట్ర ప్రభుత్వం! *విప్ ధిక్కారం 9మంది కాంగ్రెస్,6గురు దేశం ఎమ్మెల్యేలపై వేటు? *ముఖ్యమంత్రి భాషా సమస్య - అయోమయపు సమర్ధన

రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ముదుగా అందరూ ఊహించినట్టే వీగిపోయింది. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత అసెంబ్లీలో ఓటింగు జరిగింది. సభలో అవిశ్వాసానికి అనుకూలంగా 58 మంది, ప్రతికూలంగా 142 మంది ఓటు వేశారు. ఎం.ఐ.ఎం., లోక్సత్తా ప్రభుత్వాన్ని ఎండకడుతూనే ఓటింగుకు దూరంగా ఉన్నాయి. 90 మంది దూరంగా ఉన్నారు. వీరిలో గైరుహాజరైనవారు 26 మంది. మిగిలిన 64 మంది ఓటింగుకు దూరంగా ఉన్నారు.

అవిశ్వాసతీర్మానాన్ని వ్యతిరేకించడానికీ తన ప్రభుత్వాన్ని సమర్ధించుకోడానికీ ముఖ్యమంత్రి గంటకు పైగా ఇచ్చిన ఉపన్యాసం ఎంత ప్రయత్నించినా అర్ధంకాని అయోమయంగా గందరగోళంగానే మిగిలిపోయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి తెలుగు భాష వచ్చి తీరవలసిన అవసరాన్ని కూడా ఈ అవిశ్వాస తీర్మానం పై చర్చ స్పష్టం చేసింది

మొత్తం 294 మంది సభ్యులు గల శాసనసభలో కాంగ్రెస్ బలం 142గా తేలిపోవడంతో ఇది మైనారిటీ ప్రభుత్వం అని కూడా లెక్కతేలిపోయింది.

విప్లను ధిక్కరించిన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలపార్టీ పై చర్యలకు రంగం సిద్ధమైంది.

తొమ్మిది మందిపై శనివారం నాడే స్పీకర్కు ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ నాయకులు స్పష్టంచేయగా, తెలుగేదేశం పార్టీ విప్ను ధిక్కరించినవారి వివరాలను చంద్రబాబు నాయుడు కోరారు.

కాంగ్రెస్ కి చెందిన జోగి రమేష్ అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశారు. జోగి రమేష్ చేజారుతున్నట్టు శుక్రవారం సాయంత్రంనుంచే సంకేతాలు వెలువడ్డాయి. ఒక దశలో మంత్రి పార్థసారథి ఆయనను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వద్దకు తీసుకువె ళ్లగా, తాను కాంగ్రెస్తోనే ఉంటానని ఆయన చెప్పినట్టు తెలుస్తున్నది. అయితే చివరికి ఆ క్షణం వచ్చేసరికి ఆయన తీర్మానానికి అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు.

అలాగే రాజీనామా చేసి ,ఉపసంహరించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అవిశ్వాసానికి అనుకూలంగానే ఓటు వేశారు.

ఇంకా గొట్టిపాటి రవి, ఆళ్ల నాని, పేర్ని నాని, సుజయ కృష్ణ రంగారావు, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, రాజేష్, మొత్తం తొమ్మిది మంది తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు.

ఓటింగుకు రాలేనని మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీనుంచి తెలియజేశారు

ముఖ్యమంత్రిపై ఇటీవల నిప్పులు చెరుగుతున్న మాజీ మంత్రి శంకరరావు వీల్ చైర్లో సభకు వచ్చి ప్రభుత్వ విప్కు అనుగుణంగా అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఓటు వేశారు.

ఆరుగురు తెలుగుదేశం తిరుగుబాటు ఎమ్మెల్యేలు కూడా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. బాలనాగిరెడ్డి, సాయిరాజ్, అమర్నాథ్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, కొడాలి నాని, వనిత. కాగా, హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాలాచారి, చిన్నం రామకోటయ్య,

నాగం జనార్ధనరెడ్డి ఓటింగుకు గైరు హాజరయ్యారు.

ఓటింగు జరగడానికి ముందు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు.


Friday, March 15, 2013

గూగుల్ హాంగౌట్

కేంద్ర ప్రణాళికాసంఘం 12 వ పంచవర్ష ప్రణాళిక మీద సంఘ సభ్యులతో "గూగుల్ హాంగౌట్" లో గ్రూప్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది.(పూర్ కనెక్టివిటీ వల్లో ఏమో నాకు ఎంటె్రన్స్ దొరకలేదు) సాయంత్రం 5 నుంచి గంటన్నర జరిగిన హాంగౌట్ లో ప్రశ్నలు వ్యాఖ్యానాలు విమర్శలు వచ్చాయని ప్లానింగ్ మీషన్ కృతజ్ఞతలు చెబుతూ ట్విట్టర్ లో రాసింది.

బడ్జెట్ ప్రవేశపెట్టాక చిదంబరంగారు కూడా గూగుల్ హాంగౌట్ గోష్ఠిలో మాట్లాడారు

అంతా బాగానే వుంది...కనెక్టివిటీ (ప్రభుత్వానికి) బాగానే వుంది. సాధారణ అక్షరాస్యతే అంతగాలేని మన దేశంలో టెక్నాలజీని వాడుకోవడమూ బాగానే వుంది.

చివరికినూటఇరవై కోట్ల పైబడిన జనాభాకు ప్రాతినిధ్యం వహించే పార్లమెంటు సమావేశాలను కూడా గూగుల్ హాంగౌట్ లో అయిందనిపించెయ్యరు గదా!

Thursday, March 14, 2013

జనం మెచ్చని అవిశ్వాసం కథ

కాంగ్రెసేతర రాజకీయ పార్టీలన్నీ ఏకమైతే రాష్ట్రప్రభుత్వం కూలిపోతుంది. అయితే స్వియ ప్రయోజనాలను ఒదిలేసి 'అవిశ్వాస ఎజెండా' కిందికి పార్టీలన్నీ రావడం అసాధ్యమని 'నిశ్చింత' గా వున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మాత్రమే కాదు... 'ఇది జరిగే పని కాదని' సామాన్య ప్రజలకు కూడా అర్ధమైపోయింది. ఇందువల్లే 'ఏదో జరగబోతోందన్న ఆదుర్దా, ఆసక్తి' టివిల ముందు కనిపించడంలేదు.

ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి ఎన్నికలకు ఏడాదిముందు రాష్ట్రప్రభుత్వాన్ని కూల్చివేయడం మీద ఆసక్తిలేదు. ఒకవేళ కూల్చేసినా ఇష్టంలేని టి ఆర్ ఎస్, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. లేదా మధ్యంతర ఎన్నికలకు కారణమవ్వాలి. ఈ తలనొప్పులు లేకుండా ప్రజాతీర్పు ద్వారానే ఏడాది తరువాత అధికారంలోకి రావాలన్న ఆలోచనతో చంద్రబాబు ప్రజల మధ్యేతిరుగుతున్నారు.

తెలంగాణా సాధనే అజెండాగా కాంగ్రెస్ మీద వత్తిడి పెంచడంలో భాగంగానేమో ఆ పార్టీని ఒకసారి ప్రేమిస్తూ ఒకసారి ద్వేషిస్తూ కాలంగడుపుతున్న టిఆర్ఎస్ కి కొత్తగా వై ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది మొదలైంది. సీమాంధ్రలో చొచ్చుకుపోతున్న జగన్ పార్టీ తెలంగాణాలో కూడా ప్రవేశిస్తే టి ఆర్ ఎస్ బలహీనపడుతుందని ఆపార్టీ కేడర్లే అనుమానపడుతున్నాయి. తెలంగాణా ఇవ్వాలంటే సీమాంధ్రలో బలహీన పడవచ్చన్న అనుమానం జగన్ పార్టీకీ వుంది. ఈ నేపధ్యాల వల్ల ఈ రెండు పార్టీలూ ఒక అవగాహనకు వచ్చాయన్న నమ్మకం రాజకీయవర్గాలన్నిటిలోనూ వుంది. ఇలావుంటే కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి అక్రమసంబంధం వుందని కెసిఆర్ పార్టీ, జగన్ పార్టీ విడివిడిగా ఆరోపిస్తున్నాయి.

తెలంగాణా సాధనే ఏకైక ఎజెండాగా వున్న టి ఆర్ ఎస్ కి కాంగ్రస్ తో సిద్ధాంతవైరుధ్యమేదీ లేదు. కాంగ్రస్ మీద జగన్ పార్టీ విమర్శలు రాషా్ట్రనికే పరిమితం. "మత తత్వ" బిజెపితో చేతులు కలిపేదిలేదని ఆ పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. వచ్చే ఎన్నకల తరువాత అవసరాన్ని బట్టి యుపిఎ కి మద్దతు ఇచ్చే అవకాశాన్న విజయమ్మే స్వయంగా సూచించారు. ఇలాంటిషఎజెండాలతో వున్న ప్రతి పక్షాలు రెండూ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశాన్ని దుమ్మెత్తి పోస్తన్నాయి.

రాజకీయవిమర్శల మాటెలావున్నా ప్రభుత్వాన్ని కూల్చివేయడం చిన్నవిషయం కాదు. అన్నిపార్టీలూ ఏకాభిప్రాయానికి రావాలి. కలసి కూర్చుని చర్చించుకోవాలి. నోటీసు ఇవ్వాలి. సభలో చర్చజరగాలి. ఓటింగ్ కు వెళ్ళాలి...అసలు కసరత్తేమీ లేకుండా మీడియా ముఖంగా అవిశ్వాసం పెడుతున్నామని ప్రకటించేసి మద్దతు ఇవ్వకపోతే కాంగ్రెస్ తో కుమ్మక్కయినట్టేనని...అదీ మీడియా ముఖంగానే బ్లాక్ మెయిల్ చేసే దశకు టి ఆర్ ఎస్ - వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలు చేరుకున్నాయి.

కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పై నెరవేరని అవిశ్వాస తీర్మానాన్నిపెట్టిన టి ఆర్ ఎస్ - అందుకు కలసిరావడం లేదన్న ఆరోపణపై సంజాయిషీ ఇచ్చుకోవలసిన పరిస్ధితిని చంద్రబాబుకి కల్పించడం, ఇందుకు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వంతపాడటం చూస్తే ఈ పార్టీల లక్ష్యం కాంగ్రెస్ కాదని తెలుగుదేశమేననీ అర్ధమైపోతోంది.

ప్రజాప్రయోజనాలకోసంనిధుల కేటాయింపులపై చర్చలు జరగవలసిన బడ్జెట్ సమావేశాన్ని రాజకీయాలకోసం (ఈ సారి) దుర్వినియోగంచేసిన టి ఆర్ ఎస్, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలు లోతైన చర్చలేకుండా బడ్జెట్ ఆమోదించబడేలా కాంగ్రస్ పార్టీకి పరోక్షంగా తోట్పడటం కూడా గమనార్హం.

పార్టీ కార్యక్రమమైన "మీకోసం వస్తున్నా" యాత్రలో నిమగ్నమైపోయిన చంద్రబాబు ప్రధాన ప్రతిపక్షనాయకుడు అయివుండీ ప్రజా ప్రయోజనాలు ఇమిడి వున్న బడ్జెట్ సమావేశాలకు గైరుహాజరవ్వడం కూడా గమనార్హం.

ఇదంతా చూస్తే రాజకీయనాయకులందరూ కలిసి ప్రజలమీదే అవిశ్వాసం ప్రకటించారనుకోవలసి వస్తోంది






Tuesday, March 12, 2013

జర్నలిస్ట్ కావడానికి కనీస అర్హత : పరిశీలనకు ప్రెస్ కౌన్సిల్ కమిటీ

డాక్టర్ అవ్వడానికి ఎంబిబిఎస్, లాయర్ అవ్వడానికి ఎల్ ఎల్ బి, ....ఇలాగే జర్నలిస్ట్ అవ్వడానికి కనీస అర్హత అవసరమా అనే విషయమై నివేదిక ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కు నివేదిక ఇవ్వాలని ముగ్గురుకౌన్సిల్ సభ్యులతో ఒక కమిటీని కౌన్సిల్ చైర్మన్ కట్జూ ఒక కమిటీని నియమించారు.

రాజకీయ సమస్యల వల్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజా సమస్యలపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నారు 1) అవును 2) కాదు 3) చెప్పలేం 4) ఏ ముఖ్యమంత్రి అయినా ఇంతే

రాష్ట్రంలో మటు మాయమైన బి.జె.పి.!!

(సీనియర్ జర్నలిస్ట్ నందిరాజు రాధాకృష్ణ గారు నిర్వహిస్తున్న ఫేస్ బుక్ గ్రూప్ "రాజకీయ మాయాజాలం" లో ఆయనే స్వయంగా రాసిన వ్యాసమిది)

రాష్ట్రంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పటిష్ఠంగా ఉన్న రోజుల్లో జనసంఘ్ కు అంకిత భావం గల కార్యకర్తల మద్దత్ ఉండేది, జనసంఘ్ అధికారంకోసం కాకుందా విలువలకోసం నిలిచింది.ఒంటరిగానే పోరాడింది. విద్యావంతులు. సౌమ్య ధోరణికల మధ్యతరగతి అభిమానులను సంపాదించుకున్నది. 1967లో జనసంఘ్ తరఫున ముగ్గురు అభ్యర్ధులు శాసనసభకు ఎన్నికయ్యారు. 1972, 1978 ఎన్నికల్లో అ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. 1983 ఎన్.టి.ఆర్. ప్రభంజనంలో బి.జె.పి మళ్ళీ మూడు గెల్చుకుంది. ప్రజాస్వామ్య పరిరక్షణ్ ఉద్యమ పేరిట టి.డి.ఫి కి మద్దతు ఇచ్చి మిత్ర పక్షమై ఎనిమిది సీట్లు దక్కించుకుంది. 85 ఎన్నికల్లో ఆర్ రవీంద్రనాథ్ రెడ్డి, ఏ నరేంద్ర,ఎన్ ఇంద్రసేన్ రెడ్డి, బద్దమ్ బాల్ రెడ్డి, ఆర్ శ్రీనివాస్ రెడ్డి, వి రాములు, వి జైపాల, సిహెచ్ విద్యాసాగర రావు శాసనసభలో ఆశీనులయ్యారు.

1989లో ఆ సంఖ్య 5 కి దిగజారింది. 1994లో మళ్ళీ మూడేసుకుంది. 1999లో టి.డి.పి తో చేతులుకలిపి శాసనసభలో 12 కి ఎగబాకింది. ఆ సభలో కె హరిబాబు, ఎం ఏ వేమా, కోట శ్రీనివాస రావు, ఎం.ఎస్. పార్థసారధి, దాక్టర్ కె లక్ష్మణ్, ఎన్ ఇంద్రసేన రెడ్డి, ప్రేంసింఘ్ రాథోర్, జి రామకృష్ణారెడ్డి, టి వి రమణాఎడ్డి, ఎం. ధర్మారావు, కె సత్యనరాయణ, ఆర్ రవీంద్రనాథ్ రెడ్డి ఎన్నికై ప్రభంజనం సృష్టించారు. 2004, 2009 ఎన్నికల్లో రెండేసి స్థానాలకే పరిమితమైంది. టి.డి.పీ కి దూరమై 2004, 2009 ఎన్నికల్లో రెండుకే పరిమితమైంది. గత ఏదాది తెలంగాణా ఉద్యమ పుణ్యాన మహబూబ్నగర్ ఉప ఎన్నికలఓ పిల్లి పోరు పిల్లి పోరు పిట్ట తీర్చినట్లుగా అక్కడ బి.జె.పి గెలుపు సాధించింది. జాతీయస్థాయిలో 1980 లో బి.జె.పి. ఏర్పాటువరకు జనసంఘ్ గా ఉన్నా కేంద్రంలో అధికారంకోసం కాంగ్రెస్ తో తలపదలేదు.

విలువల ప్రాతిపదికపై బి జె పి 1984 ఎన్నికల్లో దేశం మొత్తం లో రెందేసీట్లు గెల్చుకోగా, అందులో ఒకటి హనుమకొండ కావడం విసేషం.అ దే పార్టీ 1989 ఎన్నికల్లో 88 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించింది. 1991 జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షం గా ఎదిగింది. 1996 లో వాజ్పేయీ నేతృత్వంలో 13 రోజులపాటు కేంద్రంలొ ప్రభుత్వం నడిపే సత్తా సాధించింది. మళ్ళీరెండు పర్యాయాలు, 1998, మార్చ్ 13 నుంచి 1999 అక్టొబరు 13 వరకు, తిరిగి 13 అక్టొబరు 99 నుంచి 2004 మే 13 వరకు రెండు దఫాలుగా బి జే పి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడింది.

రాష్ట్రం నుంచి బండారు దత్తాత్రేయ వరుసగా సికిందరాబాద్ నుంచి మూడు పర్యాయాలు లోక్ సభకు ఎన్నికై మూడు సార్లు మంత్రిగా శాఖలు నిర్వహించారు. 1999 లో రాష్త్రం నుంచి ఏడుగురు బి జె పి ఎమ్పీలుగా ఎన్నికై నలుగురు కేంద్రమంత్రులయ్యారు. 2004, 2009 ఎన్నికల్లో బి,జె,పి జాతకం తల్లకిందులైంది.ఆ పార్టీ రెంటికీ చెడ్డా రేవడ మాదిరి తయారైంది. పార్లమెంటులో నేడు బిజెపి ఒక్క సీటు కూడా దక్కించుకోలేని స్థితికి చేరుకుంది. ఒక నాదు మేధావుల పార్టీగా పేరొందిన బిజెపిని నేడు నిస్సత్తువ ఆవరించింది. ఈ పరిస్థితికి కారకులెవరు? బి.జె.పి జవసత్వాలు వస్తాయా? మోడీ నామ స్మరణమిణహా రాహుల్ నుంచి దేశాన్ని రక్షించు కునేందుకు తరుణోపాయమ ఉందని ఆ పార్టీ నేతలు ఊహిస్తున్నారా? ఇందులో వెంకయ్య నాయుడు బాధ్యత ఎంతవరకు నిర్వహిస్తారు? రాష్ట్రంలో బి.జె.పి. నాయకులు ఏమిచేస్తున్నారు? ఏమి చెయ్యాలనుకుంటున్నారు?

Monday, March 11, 2013

కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదిస్తే?

ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలను రాష్ట్రశాసన సభ స్పీకర్ ఆమోదిస్తే.... ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మల్సీలకు రావలసిన ఓట్ల సంఖ్యలో మార్పు వస్తుంది

అంతేకాకుండా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ ఏకైక ఎమ్మల్సీ అభ్యర్ధి విజయావకాశాలు వెనక్కి వెళుతాయి

ఇదేసమయంలో అధికార బలాన్ని ఉపయోగించుకుని మంత్రాంగం నడిపితే, రెండో ప్రాధాన్యతా ఓట్లని కూడగట్టుకోగలిగితే కాంగ్రెస్ పార్టీ తన ఆరవ అభ్యర్ధిని కూడా ఎమ్మెల్సీగా గెలిపించుకోవచ్చు

ప్రతి క్లిష్టసమయంలోనూ ఎలాంటి పటాటోపమూ ప్రచారమూ లేకుండా చాతుర్యంతో గెలుపు మెట్లెక్కుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ ఆవకాశాన్ని కూడా వాడుకోవాలనే ఆలోచిస్తారు. ఆదే నిర్ణయం రూపుదాలిస్తే ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించబడుతాయి.

ఒక వేళ వ్యూహం బెడిసి కొడితే వై ఎస్ ఆర్ కాంగ్రెస్ కు అది అనుకోని విజయమౌతుంది. కాంగ్రస్ పరువుపోతుంది. ఏవ్యక్తికీ రెండోసారి ముఖ్యమంత్రయ్యే అవకాశంలేని, అదే సమయంలో వెంటనే నాయకత్వాన్ని మార్చే అవకాశంలేని కాంగ్రస్ పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి "తేల్చేసుకోవడమే" బెటరన్నట్టుంటుంది.

పార్టీలో నిష్ఠూరాలూ, హైకమాండ్ వద్ద సంజాయిషీలు ఇచ్చుకోవలసిన పరిస్ధితి కోరితెచ్చుకోవడమెందుకన్న అనుభవం పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు వుండనేవుంది.

సంఖ్యాబలం రీత్యా ఐదుగురు ఎమ్మెల్సీలను సునాయాసంగా గెలిపించుకునే అవకాశం దృషా్ట్య ఆమేరకే అభ్యర్ధుల ఎంపికతో కాంగ్రెస్ హైకమాండ్ పని ముగిసింది. ఆరో అభ్యర్ధి విషయంలో నిర్ణయం కిరణ్ కుమార్ రెడ్డి చేసే రిస్క్ నిబట్టే వుంటుంది. ఇందుకు ముందుగా బొత్స ఒప్పుదల ఆతర్వాత "ఢిల్లీ గాడ్ ఫాదర్ల-గో ఎహెడ్" సిగ్నల్ కూడా ముఖ్యమే

కాంగ్రెస్ లో 6వ ఎమ్మెల్సీ అభ్యర్ధిని దింపడం రసవత్తరమైన అఫెన్స్ ఆడటమే!


దేశరాజధాని జీవనశైలి



Sunday, March 10, 2013

Sunday News Story "అను" రిటైర్మెంట్

"అను" ఈ నెలాఖరుకి రిటైరయిపోతోంది. అనూతోనే ఢిల్లీ పోలీసులు డాగ్ సా్క్వడ్ ప్రారంభించారు. డాబర్ మన్ వంశంలో పుట్టిన అను 7 నెలల పిల్లగా వున్నపుడు 5 వేలరూపాయలకు పోలీసులు కొని పేరుపెట్టారు.

అను చాలా చురుకైనది. ఎన్నో నేరగాళ్ళు రహస్యంగా దాచివుంచిన డ్రగ్స్ ను కనిపెట్టింది. బాంబులను బయటపెట్టింది. క్రిమినల్స్ ను పట్టి అప్పగించింది.59 జాగిలాలున్న సా్క్వడ్ లో అనూకి మాత్రమే 24 గంటలూ ఎక్కడికైనా తిరిగే స్వేచ్ఛ యిచ్చారంటే పోలీసులకు అనూ మీద ఎంత నమ్మకమో అర్ధమౌతుంది

ఎన్నో అందాలపోటీల్లో బహుమతులు గెలుచుకున్న అనూ వయోభారంతో చిక్కపోతోంది. ఆరోగ్యం బాగానే వున్నప్పటికీ పనిచేసేటపుడు రిటైర్ మెంటు కూడా తప్పదు కదా!

11 ఏళ్ళ సర్వీసు చేసిన అనూ మార్చి31న అధికార లాంఛనాలతో రిటైర్ అవుతోందని, ఇకపై అనూ బాధ్యతలు చూసే ఒక స్వచ్ఛంద సంస్ధకు అనూ రిటైర్ మెంటు బెనిఫిట్లు అందుతాయని ఢిల్లీ పోలీస్ అధికారప్రతినిధి ప్రకటించారు