Saturday, March 9, 2013

'గేమ్ ఛేంజి' మొదలైందా! జగన్ మొదటి గంట

ఒక పార్టీ అభ్యర్ధుల జాబితా ప్రకటించగానే సామాన్య ప్రజల్లో కూడా చిన్న హుషారు కనబడటం ఆ పార్టీ బాగా చొచ్చుకు పోయిందనడానికి ఒక సంకేతం. గెలిచినా, ఓడినా ముందు ఎత్తువేసిన వాడి ప్రభావం ఆట మీద తప్పనిసరిగా వుంటుంది

ఎమ్మెల్యేల కోటానుంచి ఎమ్మెల్సీ ను ఎన్నుకోడానికి వందేళ్ళు పైబడిన కాంగ్రెస్ అభ్యర్ధుల ఖరారు పై ఇంకా లెక్కతేల్చుకోకముందే, మూడుపదులు నిండిన తెలుగుదేశం మీన మేషాలు లెక్కబెడుతూండగానే, అక్రమ ఆస్తుల కేసులో అధ్యక్షుడు జైల్లోవున్న వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా శాసనసభకు పోటీ చేసే అభ్యర్ధుల తొలి జాబితానే "సమన్వయ కర్త" పేరుపెట్టి విడుదల చేసేసింది.

వై ఎస్ విజయమ్మ, డాక్టర్ మైసూరారెడ్డి, సోమయాజులు మొదలైనవారు చర్చించి తీసుకున్న నిర్ణయాన్ని జగన్ ఆమోదించాక జాబితా విడుదల చేశారు. చాలా స్ధానాలకు ఒకరే సమన్వయ కర్తలు వుండగా కొన్ని చోట్ల ఇద్దరు ముగ్గురు కూడా వున్నారు. సమన్వయ కర్తలకే అసెంబ్లీ టికెట్ అని పేర్లు చూస్తనే అర్ధమైపోతోంది. ఎక్కువమంది వున్నచోట వారు మొదట ఏకాభిప్రాయానికి రావాలి.పార్టీ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుంది.

జాబితాను విశ్లేషిస్తే సామాజిక సమీకరణల ఫార్ములాను ఈ పార్టీ కూడా ఏమాత్రం పక్కన పెట్టలేదని స్పష్టమైపోతోంది. ఎన్ టి ఆర్ మినహా ఫార్ములాను పక్కన పెట్టిన నాయకుడు మరెవరూ కనిపించరు.

52 అసెంబ్లీ సీట్లున్న రాయలసీమలో 39 చోట్ల సమన్వయకర్తలను ప్రకటించారు. ఇందులో 30 మంది రెడ్డి కులస్తులే.ఇక ఉత్తరాంధ్రాలో బిసిలకు గోదావరి జిల్లాల్లో కాపులు బిసిలకు ప్రాధాన్యత ఇచ్చారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుంచి చేరినవారిని కూడా చోటిచ్చారు. "మొత్తంమీద సెలక్షన్ బాగుందనిపించే" ముద్రను వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలిజాబితా వేసుకుంది.

పార్లమెంటు సీట్లు, తెలంగాణాలో అసెంబ్లీ సీట్ల జాబితాలను వ్యూహాత్మకంగా ప్రకటించలేదు.

ఈ జాబితా చూసి ఆయా సమీకరణల ప్రాతిపదికగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తమ ఎంపికలను సవరించుకోవడమో మార్చుకోవడమో చేసుకోక తప్పదు.

గెలిచినా, ఓడినా ముందు ఎత్తువేసిన వాడి ప్రభావం ఆట మీద తప్పనిసరిగా వుంటుంది

జగన్ దగ్గరవున్నది నీతిబద్ధమైన సంపద అని ఎవరూ నమ్మరు. రాజకీయ ప్రయోజనాలకోసమే నిద్రనటించి నోరుమూసుకున్న కాంగ్రెస్ ఆకస్మికంగా అవినీతి కేసులు మోపి ఆయన్ని జైలుకి పంపింది. జగన్ అవినీతిని ఎండగట్టడమే పనిగా అసలుపనిగా సొంతపనిమానేసి మరీ తెలుగుదేశం ఊదరగొట్టింది.

యాత్రవల్లా, నిరంతరం ఏదో విధంగా జనంలో వుండటం వల్లా జగన్ ఎన్నికల ఎజెండా నుంచి అవినీతిని గెంటేశారనిపిస్తోంది. మేము అతి స్వచ్ఛమని చెప్పుకోగల స్ధితి ఏపార్టీకి ఏనాయకుడికి లేకపోవడం కూడా ఇందుకు ముఖ్యకారణమే. 40 ఏళ్ళలోపువారు 65 శాతానికి చేరుతున్న యువభారతంలో జగన్ 'గేమ్ ఛేంజర్' 'అయ్యారని' అని ఆపార్టీ అభిమానులు అంటూండగా 'అవుతారని' విశ్లేషణలు సూచిస్తున్నాయి.


1 comment:

  1. The story is very interesting with rational and realistic observations and relevant analyses. This report makes us to realize what the Telugu Dailies miss today and how they have lost their credibility in the absence of Senior Pens like Mr. Peddada Naveen and Valiiswar....

    ReplyDelete