Thursday, January 31, 2013

ఎకరం భూమి-20మంది కౌలుదారులు - సహకారఎన్నికల "మాయ" - జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశం దొస్తీ!

ప్రాధమిక సహకార పరపతి సంఘాలఎన్నికలు ఆయా ప్రాంతాల్లో వ్యక్తులు గ్రూపుల ఆధిక్యత నిలబెట్టుకునే వేదికలుగా మారిపోయాయి. ఇవి పార్టీ ప్రాతిపదికన జరిగే ఎన్నకలు కాకపోయినప్పటికీ పోటీ పడుతున్నవారిలో హెచ్చుమంది ఏదో ఒక రాజకీయ పార్టీలో చురుకైన పాత్ర వహించేవారే. గ్రామ స్ధాయిలో పార్టీ నిర్మాణం జరగకపోయినా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ మీద ఆదరణను గుర్తించిన పెద్దలు ఆపార్టీ వారికి అవకాశం లేకుండా చూడటానికి చేతులు కలుపుతున్నారు. పాత రాజకీయ శత్రువులు మిత్రులైపోతున్నారు. ఈ పునరేకీకరణల ఫలితంగా కాంగ్రెస్ తెలుగుదేశం గ్రూపులు రాజీపడ్డాయి. అవగాహనకు వచ్చాయి.

ద్రవ్యోల్భణం వల్ల చేతిలో డబ్బులేక సహకార ఎన్నికల్లో ఓట్లు కొనలేని స్ధితిలో పోటీలేకుండా ఏకగ్రీవం సర్దుబాట్లు సగానికి సగం సంఘాల్లో జరిగంది. వీటికి 2 లక్షల చొప్పున ప్రభుత్వం నుంచి బహుమతి కూడా లభిస్తుందికూడా. తూర్పుగోదావరిజిల్లాలో మొదటిదశగా 133 సంఘాలకు ఎన్నికలు జరగాలి అయితే ఏకగ్రీవంగా ఎన్నికైనవిపోను 66 సంఘాలకే పోలింగ్ అవసరమైంది. ఇంచుమించు రాష్ట్రమంతా ఇదే పరిస్ధితి వుంది

గ్రామీణ ప్రాంతాల్లో నాయకత్వ ఉనికి మనుగడల కోసం ఈ సర్దుబాట్లు తప్పవు. ఇది అవకాశవాదమైతే కేంద్రంలో నానాపార్టీల ప్రభుత్వాన్ని ఏమనాలని వేమగిరిలో నామా రత్తయ్య అనే రైతు ప్రశ్నించారు. అయితే ఈ ఎన్నికల్లో కలసిపోయినవారే అసెంబ్లీ ఎలక్షన్లలో రక్తం చిందేలా పోట్లాడుకుంటారు.

భూమి యజమానులు వ్యవసాయాలు మానేసి పట్టణాలకు వెళ్ళిపోతున్న ధోరణి విస్తరిస్తోంది. రైతుకూలీలు కౌలుదారులౌతున్నారు. రుణాలకోసమో ప్రకృతివైపరీత్యాల్లో సహాయంకోసమో కౌలుదారులకు కౌలుపత్రాలు కావాలంటే భూయజమానులు ఇవ్వరు. ఆపత్రమే కౌలుహక్కుకి సాక్ష్యమై భవిష్యత్తులో భుమి చేజారిపోతుందన్న భయం అందుకు కారణం. అయితే సహకార సంఘాల ఎన్నికల్లో ఓటుహక్కు కౌలదారులకూ వుంది. దీంతో వ్యవసాయం లేనివారిని కూడా కౌలుదారులుగా రికార్డుల్లో చూపించి ఓటర్లుగా నమోదుచేయడం ప్రతిచోటా జరిగింది. ఒకే ఎకరం పొలం మీద 10 నుంచి 20 మంది నికూడా కౌలుదారులుగా పత్రాలు ఇచ్చి ఓటు హక్కు ఇప్పించిన సంఘటనలు కూడా చాలా చోట్ల వున్నాయి. 5 నుంచి 10 సెంట్ల భూమిలో వ్యవసాయ రికార్డుల్లో సాధ్యమే కాని నిజంగా వీలుపడదు

సంఘాల పదవీకాలం ముగిశాక అధికారులను ఇన్ చార్జ్ లుగావుంచి ఎన్నికలు జరపడం పరిపాటి. కిరణ్ కుమార్ ప్రభుత్వం మాత్రం సంఘాల అధ్యక్షులనే పర్సన్ ఇన్ చార్జ్ లుగా నియమించింది ఆతరువాత కొంతకాలానికి ఇపుడు ఎన్నికలు జరుగుతున్నాయి.ఇందువల్ల మాజీ అధ్యక్షులు తమకు వీలుగా నమోదు మొదలైన ఏర్పాట్లు చేసుకునే వీలుకుదిరింది. ఆలాగని ఫలితాల్లో పాతఫలితాలే మళ్ళీ వస్తాయనుకునే వీలులేదు.

No comments:

Post a Comment