Saturday, March 16, 2013

ఆ ఎమ్మెల్యేలపై వేటు వేసే ధైర్యం ఉందా!

అవిశ్వాస తీర్మానం సందర్భంగా విఫ్ ఉల్లంఘించిన కాంగ్రెస్ , టిడిపి ఎమ్మెల్యేలపై వేటు పడుతుందా అన్నది చర్చనీయాంశంగా ఉంది.కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టిన అవిశ్వాసానికి అనుకూలంగా తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటు వేశారు.జోగి రమేష్ , పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , గొట్టిపాటి రవి, ఆళ్ల నాని, పేర్ని నాని, సుజయ కృష్ణ రంగారావు, ద్వారంపూడి చం«ద్రశేఖర రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, రాజేష్ కూడా అవిశ్వాసానికి ఓటు వేసిన వారిలో ఉన్నారు.కాగా, ఆరుగురు తెలుగుదేశం తిరుగుబాటు ఎమ్మెల్యేలు కూడా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. వారు బాలనాగిరెడ్డి, సాయిరాజ్, అమర్నాథ్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, కొడాలి నాని, వనిత ఉన్నారు. తటస్థంగా ఉండాలని పార్టీ వీరికి విప్ జారీ చేయగా దానిని వారు ఉల్లంఘించారు.మరో ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి తీర్మానం ప్రతిపాదన సమయంలో మద్దతు ఇచ్చినా, ఆ తర్వాత ఓటింగు సమయంలో పాల్గొనలేదు. విప్ ఉల్లంఘించినవారిపై ఇప్పటికిప్పుడు అనర్హత వేటు వేస్తే ఆరు నెలలలోగా ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉంటుంది.గత ఉప ఎన్నికలలో పద్దెనిమిది ఉప ఎన్నికలు జరిగితే పదిహేను చోట్ల వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గెలవడంతో ఆ పార్టీకి కొత్త ఊపు వచ్చినట్లయింది.ఇప్పుడు కూడా మరో ఏడాదిలోగా సాధారణ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఉప ఎన్నికలు రావాలని కాంగ్రెస్ ,టిడిపిలు కోరుకోవడం లేదు. అయినప్పట్టికీ సవాలుగా తీసుకుని విప్ ఉల్లంఘించినవారిపై వేటు వేసి ఎన్నికలకు సిద్దపడితే చెప్పలేం .కాని ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం వేటు వేయడానికి మరికొంత సమయం తీసుకోవచ్చు.మరో ఆరు నెలల వరకు దీనిని పెండింగులో ఉంచి, ఆ తర్వాత అనర్హత వేటు వేసినా ఉప ఎన్నికలకు అవకాశం ఉండదని భావిస్తున్నారు. అందువల్ల ఉప ఎన్నికలు వద్దని భావించే పక్షంలో కాంగ్రెస్,టిడిపిలు ఇప్పటికిప్పుడు అనర్హత వేటు వేసే దిశగా వెళ్లకపోవచ్చని భావిస్తున్నారు.

No comments:

Post a Comment