Saturday, April 13, 2013

ఎన్నికల సీన్ మార్చే ఫేస్ బుక్?

బిజెపి-కాంగ్రెస్ పార్టీల మధ్య ఉత్తర భారత దేశంలో "ట్విట్టర్" యుద్ధమే జరుగుతోంది. 140 అక్షరాల కు పరిమితమైన ట్విట్టర్ ఎందువల్లనో దక్షిణ భారతదేశానికి అంతగా విస్తరించలేదు.

అయితే కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రల్లో ఫేస్ బుక్ విస్తరణ అపారంగా పెరిగిపోతోంది. యువతీ యువకులను కట్టి పడేసి, నడివయసు స్త్రీ,పురుషులను వశపరచుకుని ఐదు పదులు పైబడినవారిని కూడా విశేషంగా ఆకర్షిస్తోంది.

ప్రో యాక్టివ్, పాజిటివ్ ధింకింగ్ లాంటి నమూనాల నుంచి డిజైన్ అయిన ఫేస్ బుక్ లో "లైక్" (నచ్చడం) మాత్రమే వుంటుంది. నచ్చకపోతే ప్రత్యేకంగా కామెంటు రాయడమే తప్ప "డిస్ లైక్" లాంటి ఆప్షన్ ఏదీ వుండదు.

అంటే ఒక ప్రతిపాదన (పోస్టింగ్) నచ్చితే లైక్ పెట్టడమో, నచ్చకపోతే ఆ పోస్ట్ ని వదిలేయడమో మాత్రమే జరుగుతుంది. అంటే ఏ అంశం మీదైనా పాజిటివ్ అభిప్రాయాలు మాత్రమే లెఖ్ఖలోకి వస్తుంది. ఏకంగా ఇన్ని లైకులా అని "లైక్" మార్క్ చేసేవారిసంఖ్య తక్కువేమీకాదు.

దీని ప్రభావం చాలా ఎక్కువ. నరేంద్రమోడీ ప్రధానిగా వుండాలన్న అభిప్రాయం అతివేగంగా విస్తరించడానికి ఇలాంటి సోషల్ సైకాలజీ ప్రధాన కారణం. ఈ సూత్రాన్ని గుర్తించి మోడీ ప్రచారవ్యూహంలో ట్విట్టర్, ఫేస్ బుక్, గూగుల్ ప్లస్ మొదలైన మీడియాల్లో ఆయనకోసం పనిచేసే ప్రొఫెషనల్స్, మద్దతుదారులు ముందుగా చొరబడిపోయారు. కాస్త ఆలస్యంగా కాంగ్రెస్ కూడా ఇదే మార్గాన్ని ఎంచుకుంది. అప్పటికే మోడీకి ఒక ఊపు వచ్చేసింది. చదువుకున్న వాళ్ళలో మధ్యతరగతి లో ప్రచారానికి సంబంధించినంత వరకూ మోడీ క్యాంపెయిన్ కి సోషల్ మీడీయా పెద్ద వేదిక అయ్యింది.

నిజమో అబద్ధమో తెరముందో తెరవెనుకో ఎవరైనా పూనుకుంటే ఫేస్ బుక్ లో అదే పనిగా ప్రచారమైపోతున్న ధోరణి ప్రస్తుతంవుంది. ఇందుకు 'కొత్తపిచ్చి' , 'వేలం వెర్రి' ప్రధాన కారణాలైతే. ఏకపక్ష వాదనను వ్యతిరేకించే (డిస్ లైక్) ఆవకాశం డిజైన్ చేయబడకపోవడం ముఖ్యకారణం. ఒకరి ప్రతిపాదన (పోస్టింగ్)ను అదే పోస్టులో కామెంటుగా ఖండించడం, వ్యతిరేకించడం సభ్యత కాదన్న సంస్కారం మరో కీలకమైన కారణం.
ఇందువల్ల హిడెన్ అజెండాలతో ఫేస్ బుక్ లో తిష్టవేసి
"బంతిని ఏకపక్షంగా దొర్లించుకుపోవడమే లక్ష్యంగా పెట్టుకుంటే" అదేమంత కష్టంకాదు. మోడీ మద్దతు దారులు ఆయన ఇమేజ్ టి్రమ్మింగ్ కోసం ఇలాంటి అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్నారు. వెంట పడిన కాంగ్రస్ వారు వెనుకే వుండిపోయారు.

ఐరిస్ నాలెడ్జ్ ఫౌండేషన్, భారత ఇంటర్నెట్, మొబైల్ సంఘం 'సోషల్ మీడియా' లోక్సభ ఎన్నికలు' పేరిట అధ్యయనం జరిపారు. ఈ నేపధ్యంలోనే...

దేశంలోని మొత్తం 543 లోక్సభ స్థానాల్లో 160 స్థానాలపై సోషల్ మీడియా అత్యంత ప్రభావం గల లోక్సభ నియోజకవర్గాలుగా సర్వే గుర్తించింది. మొత్తం ఓటర్లలో 10 శాతానికి పైగా లేదా గత లోక్సభ ఎన్నికల్లో విజేతకు వచ్చిన మెజారిటీ సంఖ్య కన్నా ఎక్కువ మంది ‘ఫేస్బుక్’ ఖాతాదారులున్న నియోజకవర్గాన్ని అత్యంత ప్రభావం గల నియోజకవర్గంగా వర్గీకరించింది. ఈ స్థానాల్లో అభ్యర్థి భవితవ్యాన్ని నిర్ణయించడంలో ఫేస్బుక్ ఖాతాదారుల తీర్పే కీలకం కానుందని సర్వే అభిప్రాయపడింది. ఈప్రకారం మన రాష్ట్రంలో ఫేస్బుక్ ప్రభావం పడనున్న లోక్ సభ నియోజకవర్గాలు: హైదరాబాద్,విశాఖపట్నం,విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కరీంనగర్, నరసారావుపేట, చిత్తూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు
ఇక అత్యధికంగా మహారాష్ట్రలో 21, తరువాత గుజరాత్ లో 17 లోక్ సభానియోజక వర్గాల్లో ఈ ప్రభావం వుంటుందని అభిప్రాయపడింది.

ఉత్తరప్రదేశ్-14, కర్నాటక-12, తమిళనాడు-12, ఆంధ్రప్రదేశ్-11, కేరళ-10, మధ్యప్రదేశ్-9, ఢిల్లీ-7,హర్యానా-5, పంజాబ్-5, రాజస్ధాన్-5, బీహార్-4, చత్తీస్ ఘడ్-4, జమ్మూకాశ్మీర్-4, ఝార్కండ్-4, పశ్చిమబెంగాల్-4, ఈ స్ధానాల్లో కూడా ఫేస్ బుక్ ప్రభావం హెచ్చుగా వుంటుందని, దేశవ్యాప్తంగా మరో 67 స్ధానాల్లో ఈ ప్రభావం ఒక మోస్తరుగా వుండవచ్చని , 60 స్ధానాల్లో కనీస ప్రభావం వుండవచ్చనీ సర్వే తెలియచేసింది.

దేశవ్యాప్తంగా 256 లోక్ సభాస్ధానాల్లో ఫేస్ బుక్ ప్రభావం ఏమాత్రం వుండదని కూడా సర్వే తేల్చేసింది

ఫేస్ బుక్ లో ప్రతిపాదన అందుకు పలువురి ఆమోదం అనేది ఒక డిజైన్ గా వుంటే ట్విట్టర్ లో ఒక అభిప్రాయానికి ఆమోదం లేదా తిరస్కారం లేదా అభిప్రాయం ఏదైనా 140 అక్షరాల పరిమితిలో రాయాలి అక్కడ "లైక్" అనే ఆప్షన్ లేక పోవడంవల్ల ఒక అభిప్రాయంపై ఆలోచనే తప్ప ఫేస్ బుక్ లో మాదిగిగా అంకెల మద్దతు అది పెరిగిపోతూ వుండటమనేదే వుండదు.



No comments:

Post a Comment